ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

  • ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం
  •  మూడు రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులర్ డ్యూటీగా పరిగణిస్తామని వెల్లడి
  •  కార్మికులపై పెట్టిన పోలీసు కేసులను కూడా ఎత్తివేయాలని ఆదేశం
  •  వెంటనే చర్యలు తీసుకోవాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం సూచన
  •  వెయ్యి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవల కార్మికులు చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కాలాన్ని రెగ్యులర్ డ్యూటీగా పరిగణించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా, సమ్మె సమయంలో కార్మికులపై నమోదు చేసిన పోలీసు కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు.

 హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ హామీల అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను, ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను 100 శాతం పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సంస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.8,000 కోట్లు అందించిందని, ఉద్యోగుల బకాయిల కోసం రూ.1,000 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు.

అలాగే, మెట్రో రైల్ నెట్‌వర్క్‌కు అనుసంధానంగా 1,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. శంషాబాద్ సమీపంలోని బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో, గజూలరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.  

Revanth Reddy
TSRTC
Telangana RTC strike
ponnam prabhakar
rtc employees salaries
rtc police cases
mahalakshmi scheme
electric buses
bus terminals

More Telugu News